క్షేత్ర స్థాయిలో రైల్వే ట్రాక్ పనులు పరిశీలించిన. మంత్రి హరీష్
– సిద్ధిపేటకు తొందరలో రైలు వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయలి.
– రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా, పనుల వేగం పెంచాలి.
సిద్ధిపేట యదార్థవాది
సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులను క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్ లతో పరిశీలించారు.. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మనోహరాబాద్ నుండి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ పనులు జరుగు చున్నాయని, మనోహారబాద్ గజ్వేల్ వరకు 32 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి గజ్వేల్ వరకూ రైలు రావడం, రైతులకు మేలు జరిగేలా రేక్ పాయింట్ ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయని, గజ్వేల్-దుద్దెడ వరకు 32.1 కిలో మీటర్లు సైతం ట్రాక్ నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. కుకునూరుపల్లి-దుద్దేడ మధ్య రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ చేశారని, దుద్దెడ-సిద్ధిపేట మధ్య ఎర్త్వర్క్కూడా పూర్తయ్యిందని, దుద్దెడ-సిద్ధిపేట-సిరిసిల్ల 48.65 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణ పనులు పురోగతితో శరవేగంగా జరుగుతున్నాయని, వీటిలో దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే ట్రాక్ దాదాపు పూర్తయ్యిందని అన్నారు. ఇకమిగిలింది సిద్ధిపేట-సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38.6 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు.
దుద్దెడ నుండి సిద్ధిపేట వరకు ట్రాక్ నిర్మాణ పనులు పూర్తయి మరో 60 రోజులలో సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహణ ఉంటుందని, ఈ క్రమంలో సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయింపు చేసినట్లు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబు, ఇతర అధికార యంత్రాంగం పాల్గొన్నారు..