భారీగా పోలీసుల మోహరింపు..
గతంలోనే మార్క్ చేశాం: ఆర్డీవో..
విశాఖపట్నం: 6 జనవరి
విశాఖలోని గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు.వేకువజాము నుంచే దీనికి సంబంధించిన కసరత్తును మొదలు పెట్టడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. వైద్యకళాశాల భవనాలను కూలుస్తారనే ప్రచారమూ జరిగింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టడం.. మరోవైపు తెదేపాకు చెందిన ముఖ్యనేతలను గృహనిర్బంధం చేయడంతో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది. గతంలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు చేస్తున్నట్లు భీమిలి ఆర్డీవోపేర్కొనడంతో ఉత్కంఠకు తెరపడింది.తెల్లవారుజామునే రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది గీతం వైద్యకళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. కంచె ఏర్పాటుకు అవసరమైన సామగ్రితో అక్కడికి చేరుకుని పనులు మొదలుపెట్టారు. భీమిలి ఆర్డీవో భాస్కర్రెడ్డి, డీఆర్వో పర్యవేక్షణలో సుమారు 3 గంటలపాటు పనులు కొనసాగాయి. పలుచోట్ల ‘ప్రభుత్వ భూమి’ బోర్డులు ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు నేపథ్యంలో గీతం వైద్య కళాశాల పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గంలో వెళ్లే వారిని తనిఖీలు చేశారు. మీడియాతో పాటు ఎవర్నీ కళాశాల లోపలికి అనుమతించకుండా కంచె ఏర్పాటు పనులు పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.. గతంలోనే మార్క్ చేశాం: ఆర్డీవో కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పుడు కంచె మాత్రమే ఏర్పాటు చేశామని ఆర్డీవో భాస్కర్రెడ్డి తెలిపారు. రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37, 38లోని స్థలాన్ని అప్పట్లో స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని.. ఇవాళ 5.25 ఎకరాల్లో కంచె వేశామని చెప్పారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములే సరిహద్దులుగా ఉండటంతో కంచె ఏర్పాటు చేయలేదని వివరించారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవన్నారు. పని త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచి పనులు చేపట్టామన్నారు. పది చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని ఆయన వివరించారు. నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని ఆర్డీవో స్పష్టం చేశారు.