రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ రాక..
హైదరాబాద్ 26 డిసెంబర్ 22
శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. అయిదు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆమె పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. దిల్లీ నుంచి భారతీయ వాయుసేన విమానంలో రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి.. భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ చేపట్టిన ‘ప్రసాద్’ పథకం కింద ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని, బొల్లారంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్దకు వెళ్లి అమర జవాన్లకు నివాళులర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ఇచ్చే విందులో సాయంత్రం 7.45 గంటలకు పాల్గొంటారు. 27న ఉదయం 10 గంటలకు నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల బోధకులు, విద్యార్థి ని, విద్యార్థులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొంటారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో 74వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ అధికారులతో ముఖాముఖీకి మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారు. కంచన్బాగ్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని)కి వెళ్లి వైడ్ ప్లేట్ మిల్లును ప్రారంబిచ్చంనున్నారు.28న ఉదయం హకీంపేట నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి.. అక్కడి నుంచి హెలికాప్టర్లో భద్రాచలానికి వెళ్లి, సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. వనవాసీ కల్యాణ్ పరిషత్ – తెలంగాణ ఏర్పాటు చేసే సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను భద్రాచలం నుంచే ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 2.20 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కామేశ్వరాలయ ఆలయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారు. 29న ఉదయం 11 గంటలకు జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బీఎం మలానీ నర్సింగ్ కళాశాల, మహిళా దక్షత సమితి సుమన్ జూనియర్ కళాశాలల బోధకులు, విద్యార్థినులతో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్లో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్లో యాదాద్రికి వెళ్లి.. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి నిలయానికి తిరిగి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇస్తారు. వీరనారీలను సత్కరిస్తారు.
– స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి
కేసీఆర్
శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం హకీంపేటకు వెళ్లనున్నారు. సోమవారం రాత్రి రాజ్భవన్లో ఆమె గౌరవార్థం గవర్నర్ ఇచ్చే విందు కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉంది.