స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 పై గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 పై జిల్లాలో అన్ని గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేయాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.. మంగళవారం కలెక్టర్ జిల్లా సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో సర్వేక్షణ్ గ్రామీణ్ -2023, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్, మన ఊరు – మన బడి, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, తదితర అంశాలపై ఎంపీడీఓ లతో సమీక్ష నిర్వహించారు. సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 లో భాగంగా ప్రతీ గ్రామంలో డ్రైనేజీ ఎండ్ పాయింట్ ను గుర్తించాలని, ఇంకుడు గుంతలను నిర్మించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందాలు తమ గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరైనా వాడినా, డంప్ చేసినా గుర్తించి, బాధ్యులపై జరిమానా విధించాలని అన్నారు. అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అసంపూర్తిగా ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై మండల ఎంపీడీఓ లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంకుల నుండి సేకరించిన వ్యర్థాలను రగుడు లోని ఫికల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు మాత్రమే పంపించేలా చూడాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీపీఓ రవీందర్, అదనపు డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ లు, తదితరుల పాల్గొన్నారు.