అండమాన్ దీవులకు..నామకరణం చేసిన ప్రధాని
అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు.. నామకరణం చేసిన ప్రధాని
యదార్థవాది ప్రతినిధి దిల్లీ:
ప్రధాని నరేంద్రమోదీ సోమవారం అండమాన్ నికోబార్లోని 21 దీవులకు పేర్లు పెట్టారు. 21 మంది పరమ్వీర్ చక్ర గ్రహీతల పేర్లు వీటికి పెట్టారు..పరాక్రమ్ దివస్ను పురస్కరించుకొని.. పేర్లు లేని వాటికి తాజాగా పేర్లు పెట్టారు. అలాగే నేతాజీ గౌరవార్థం ఒక జాతీయ స్మారకం నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.’ఈ అండమాన్ గడ్డ మీదే మొదటిసారి మన త్రివర్ణపతాకం రెపరెపలాడింది. స్వతంత్ర భారత్కు చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్ దివస్గా నిర్వహిస్తోంది. ఈ 21 మందికి దేశమే అన్నింటికంటే ముఖ్యం. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి తీర్మానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే అండమాన్ అభివృద్ధి దిశగా ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది’ అని ప్రధాని వెల్లడించారు.అండమాన్ దీవుల్లో పేరులేని పెద్ద దీవికి మొదటి పరమ్ వీర్ చక్ర గ్రహీత మేజర్ సోమ్నాథ్ శర్మ పేరుతో నామకరణం చేశారు. ఆయన నవంబర్ 3, 1947లో శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పాక్ చొరబాటుదారులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 21 దీవులకు పేర్లు పెట్టారు. ‘రియల్ లైఫ్ హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాని అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. దానికి అనుగుణంగానే పేర్లు లేని 21 దీవులకు పరమ్ వీర్ చక్ర గ్రహీతల పేర్లు పెట్టాలని నిర్ణయించారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.2018లో మోదీ.. రోజ్ ఐలాండ్స్కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా పేరుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడే ఇప్పుడు జాతీయ స్మారకాన్ని నిర్మించేది. అలాగే నీల్ ఐలాండ్, హేవ్లాక్ ఐలాండ్కు షాహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే.