తెలంగాణలో విద్యార్థులు టీచర్లతో సైబర్ ఆర్మీ సిద్ధం
సీఏపీ ద్వారా సైబర్ నేరాల నివారణపై శిక్షణ
యదార్థవాది ప్రతినిధి హైదరాబాద్
రాష్ట్రంలో సైబర్ నేరాలను క్షేత్రస్థాయి నుంచి నివారించేందుకు సైబర్ ఆర్మీ సిద్ధమైంది. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ సైబర్ నేరాలపై విస్తృతంగా చర్చించేందుకు, ప్రతి ఇంటిలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా సైబర్ ఆర్మీని సిద్ధం చేసింది. తెలంగాణ పోలీస్, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ ఆర్మీకి అంకురార్పణ చేశారు. సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫామ్ (సీఏపీ) కింద రాష్ట్రవ్యాప్తంగా 9,524 మంది విద్యార్థులు, 4,762 మంది టీచర్లకు సైబర్ నేరాల నివారణపై శిక్షణ కల్పించనున్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లోంచి స్కూలుకు నలుగురు చొప్పున చురుకైన విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేశారు సైబర్ నేరాల నివారణకు విద్యార్థులనే ఆయుధాలుగా ఎంచుకున్నది పోలీస్ శాఖ. ఈ కార్యక్రమం మొత్తాన్ని పర్యవేక్షిస్తూ విద్యార్థులకు సైబర్ నేరాల నివారణపై శిక్షణ ఇచ్చేందుకు పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది