మావి గొంతెమ్మ కోర్కెలు కాదు.. బకాయిలనే అడుగుతున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు..
యధార్థ వాది 22 జనవరి అనంతపురం:
ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా అనంతపురంలో నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న దాంట్లో నిజంలేదని.. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని చెప్పారు. ”మాకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోంది. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారు. ఒకటో తేదీకల్లా జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చింది. చట్టప్రకారం మాకు రావాల్సినవి కూడా ఇవ్వట్లేదు. కొత్త జీవోలఊసే లేకుండా పోయింది. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎవరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్సులేమీ ఇవ్వలేదు. ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదు. ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకూ లేదు. కరోనా బారినపడి వందల మంది చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదు. రిటైర్మెంట్ బెన్ఫిట్లు చెల్లించట్లేదు” అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.