రేషన్ డీలర్లతో మంత్రి చర్చలు సఫలం
హైదరాబాద్ యదార్థవాది
రేషన్ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ రేషన్ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటీ(జెఎసి)తో చర్చలు జరిపారు…
పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే వుందని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దని ఈ బాధ్యతను విస్మరించి రేషన్ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరం అన్నారు. వచ్చే నెల 5వ తేది నుండి రేషన్ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం మంత్రి గంగుల తెలంగాణ రేషన్ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటీ(జెఎసి)తో చర్చలు జరిపారు… సమావేశంలో శాసనసభ్యులు వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమీషనర్ వి.అనిల్కుమార్, జెఎసి చైర్మన్ నాయికోటి రాజు, వైస్ ఛైర్మన్ బంతుల రమేష్బాబు, కన్వీనర్ దుమ్మాటి రవీందర్, కో`కన్వీనర్ గడ్డం మల్లికార్జున్ పాల్గన్నారు. ఈ సమావేశంలో జెఎసి ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారినికి సానుకూలంగా ఉన్నామని ఇందుకు సంబధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని, గౌరవ వేతనం, కమీషన్ పెంపు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు.. మంత్రి హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు జెఎసి ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంపూర్ణ నమ్మకం వున్నందున ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు..