సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం..
జగిత్యాల యదార్థవాది
పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతూ… ఎకో ఫ్రెండ్లీ గా తీర్చిదిద్దిన జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సందర్శకులనే కాక పక్షులను ఆకర్షిస్తుంది. సముదాయంలో పని చేసే ఉద్యోగులకు, వివిధ పనుల కోసం జిల్లా కార్యాలయానికి వచ్చే సందర్శకులకూ పక్షుల కిలకిల రావాలతో స్వాగతం పలుకుతుంటాయి. కాగా మంగళవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణలో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది. చాలా సేపు కార్యాలయ ఆవరణలోని లాన్ లో మయూరం అటూ ఇటూ తిరుగుతూ సందడి చేసింది. ఇదే సమయంలో కార్యాలయానికి వచ్చిన తెలంగాణ సాంస్కృతిక సారథి దొబ్బల ప్రకాష్ మయూరపు సోయగాలను తన మొబైల్ లో బంధించారు. మయూరపు సోయగాల వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన సోయగాలతో జాతీయ పక్షి నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.
* ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో ఈ నెల 15 న నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్- 2022లో జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గోల్డెన్ గార్డెన్ అవార్డ్ చేజిక్కించుకోవడం విశేషం.
* జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పచ్చదనం పెంపొందించేందుకు అధికారుల తీసుకుంటున్న ప్రత్యేక చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.