జమ్ములో జంట పేలుళ్లు…
జోడో యాత్ర నేపథ్యంలో హై అలర్ట్
శ్రీనగర్: యదార్థవాది ప్రతినిది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న తరుణంలో.. జమ్ములో జంట పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముఖ్యంగా రాహుల్గాంధీ జోడో యాత్ర కొనసాగే మార్గాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే, బాంబు పేలుళ్లకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియ రాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫొరెన్సిక్ నిపుణులు, క్లూస్ బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి.పేలుళ్లు చోటు చేసుకున్నట్లు ధ్రువీకరించిన జమ్ము అదనపు డీజీపీ ముకేశ్ సింగ్.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర జమ్ముకు 60 కిలోమీటర్ల దూరంలో చద్వాల్ వద్ద కొనసాగుతోంది. శీతాకాల విరామం అనంతరం శుక్రవారం యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ ఇవాళ బ్రేక్ ఇచ్చారు. తిరిగి రేపు ప్రారంభించనున్నారు. జనవరి 30 నాటికి యాత్ర పూర్తి చేయాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. భద్రతా పరమైన కారణాల రీత్యా ఏ మార్గంలో యాత్ర నిర్వహించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు అధికారులకే వదిలేశాయి. దీని కోసం రెండు మూడు రూట్లను ఎంపిక చేసి అధికారులకు ఇచ్చారు.