నల్లగొండలో కేటీఆర్ రైతుధర్నా ఒక డ్రామా
నల్లగొండ, యాదార్ధవాది ప్రతినిధి, జనవరి 29: నల్లగొండలోని రైతుధర్నాలో కేటీఆర్ దగుల్బాజీ మాటలు మాట్లాడారని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందని ధ్వజమెత్తారు. కెసిఆర్ గడీల పాలన సాగించాడని, ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వకుండా మోసం చేసిండని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని తండ్రి, కొడుకులు అందినకాడికి దోచుకున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని, గతంలో ప్రజలు, రైతుల సమస్యల కోసం ధర్నాలు చేస్తే ధర్నా చౌకాను ఎత్తివేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పది సంవత్సరాల కాలంలో అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, దోచుకున్నారని విమర్శించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కేటీఆర్ నల్లగొండకు వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నాడని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య కోసం పోరాటం చేశాడని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని, మంత్రులను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని, ఇటీవల గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జగదీశ్ రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని అన్నారు. పార్టీ కడవలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ఒక్కటేనని, ఇప్పటికైనా కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో కేటీఆర్ రైతుధర్నా ఒక డ్రామా నల్లగొండ గడ్డ కోమటిరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు సమస్యలు గుర్తుకొస్తున్నాయని, కెసిఆర్ దేవరకొండకు వచ్చినప్పుడు సొరంగం మార్గాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని, డిండి ప్రాజెక్టును పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి చేస్తానని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో నెల్లికల్ ఎత్తిపోతల పథకం హామీ ఇచ్చి మోసం చేసిరని, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల 10 వేల ఎకరాలకు 11 విడతలు ప్లాట్లకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారని తెలిపారు. నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను నిలువునా మోసం చేశాడని, నల్లగొండలో రైతు మహా ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని, నల్లగొండలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి తప్ప అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దొరల పాలన సాగించిన కెసిఆర్, కేటీఆర్ మాటలను ప్రజలు ఇప్పుడు ఎవరు నమ్మడం లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, ఇబ్రహీం, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, కత్తుల కోటి,వజ్జ రమేష్ యాదవ్, కిన్నెర అంజి , గురిజ వెంకన్న, జానీ యాదవ్, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.