డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి..
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఇండ్లు మంజూరై ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభంకానీ డబుల్ బెడ్ రూం ఇండ్ల వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సిరిసిల్ల, తంగళ్ళపల్లి, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట, తహశీల్దార్లతో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల ప్రారంభం, వేగవంతానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గానికి 4 వేల 429 రెండు పడక గదుల ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో 3 వేల 178 ఇండ్లు ఇప్పటికే పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఇండ్లు మంజూరైన కూడా ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదని వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, ఆర్ & బి ఈఈ శ్యామ్ సుందర్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జానకి, మండల తహశీల్దార్లు, ఏఈ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.