అదానీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే గ్యాస్ ధరల పెంపు
యదార్థవాది ప్రతినిధి కరీంనగర్
భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీకి లబ్ధి చేకూర్చేందుకు గ్యాస్ సిలిండర్లపై 50 రూపాయల పెంచారని విమర్శించారు. పెరుగుతున్న ధరల పై ఆడబిడ్డలు ఆలోచన చేయాలని, పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి గుంగుల అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం మరోసారి పేద మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానీకి ఇటీవల జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే తాజా గ్యాస్ పెంపు అని విమర్శించారు. 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో సిలిండర్ పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు బీజెపీ అధికారంలోకి రాకముందు.. 8 సంవత్సరాల క్రితం కేవలం 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరుకుంది. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని ఎద్దేవ చేశారు. ధరల పెంచడంపైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం… పేద, మధ్యతరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని, పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదని మంత్రి గంగుల మండిపడ్డారు.