అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు
-లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి
-ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, యదార్ధవాది ప్రతినిధి, జనవరి 29: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన నిర్వహించారని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్,ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం నిర్వహణ విషయంలో ఉపాధి హామీ సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన నిర్వహించారంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ లోని ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరయ్యే ఇంటి నమూనా నిర్మాణం చేపట్టి, 40 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నమూనాను చూసి నియోజకవర్గ ప్రజలు ఇందిరమ్మ ఇళ్లపై అవగాహన పెంచుకుంటారని అన్నారు. పథకాల అమలులో ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా అధికారులు ఎలాంటి తప్పిదాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజమైన అర్హులకు పథకాలు లబ్ధి చేకూరేలా అధికారులు పారదర్శకత పాటించాలని కోరారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మండల పరిషత్ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.