ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
పెద్దపల్లి యదార్థవాది ప్రతినిది
*ఎన్నికల వ్యయ వివరాలను పకడ్బందిగా నమోదు చేయాలి.
*అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు.
*నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలి.
*ప్రతి రాజకీయ పార్టీ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి ఒక వ్యయాన్ని నమోదు చేయాలి.
*ఎన్నికల వ్యయ వివరాలు నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి.
అసెంబ్లీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారిణి సి.శ్రీమాలతో కలిసి ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ (ఏ.ఈ.ఓ)లతో సమీక్షించారు.క లెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన తెలిపారు. జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన మేరకు నియోజకవర్గంలో ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, అక్రమ నగదు బంగారం , ఇతర ముఖ్యమైన ఆభరణాలు, ఉచితాల పంపిణీని అరికట్టేందుకు ఈ బృందాలు కట్టుదిట్టంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణిను గుర్తించడం, రిపోర్ట్ చేయడం ఆధారాలు సేకరించడం, రికార్డు చేయడం చాలా కీలకమని, సి-విజల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబర్, ఇతర మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎన్నికలకు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండాపాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని, ప్రస్తుతం పంట దిగుబడి వచ్చే సమయం వస్తున్నందున రైతులు పంట డబ్బులు తీసుకునే అవకాశం ఉందని వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా రైతులు రసీదు దగ్గర ఉంచుకునే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వివిధ అవసరాల కోసం బ్యాంకులో నుంచి నగదు ఉపసంహరణ చేసుకునే వారుతప్పనిసరిగా రసీదు, ఆధారాలు ఉంచుకునే విధంగా వారికి అవగాహన కల్పించాల్సిందిగా బ్యాంకర్లకు సూచిస్తామని ఆయన అన్నారు.. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారిణి సి.శ్రీమాల మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల వ్యయ వివరాల నమోదు ఒక అంశమైతే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మరో ఎత్తుగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగే ప్రతి రాజకీయ సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియోగించిన వాహనాలు, కుర్చీలు, స్టేజి, సౌండ్ ఏర్పాట్లు , భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేయాలని అన్నారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు, మాస్టర్ ట్రైనర్ రాంమోహన్, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్, వీడియో సర్వేలెన్సు, వీడియో వ్యూయింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.