పారిశుధ్య కార్మికుల సమక్షంలో కుమార్తె పుట్టినరోజు వేడుకలు
కార్మికులతో కలసి సహపంక్తి భోజనం చేసిన కుటుంబం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: సెలెబ్రిటీలు, విఐపి లు, రాజకీయ నాయకుల సమక్షంలో పుట్టిన రోజును ఎంత ఆడంబరంగా జరుపుకుంటే అంత గొప్ప అని భావిస్తున్న నేటి సమాజంలో వినూత్న ఆలోచన చేసిన ఆ దంపతులు తమ కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పారిశుధ్య కార్మికులతో కలసి కేక్ కట్ చేయించి, సహపంక్తి భోజనాలు చేయడంతో పాటు వారికి శాలువా తో సత్కరించారు జిల్లా కేంద్రంలోని మిని ట్యాంక్ బండ్ సమీపంలోని రజిత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నిర్వాహకురాలు ఐతబోయిన రజిత రాంబాబు గౌడ్. శుక్రవారం వారి కుమార్తె ఐతబోయిన శరణ్య 15వ జన్మదిన వేడుకలను పారిశుధ్య కార్మికులతో కలసి వారు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నిత్యం మన మంచి కోసం మన ఆరోగ్య పరిరక్షణ కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కూడా మన కుటుంబ సభ్యులే, మన బందువులే వారితో కలసి కుమార్తె శరణ్యతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఇంటిలో పారిశుధ్య కార్మికులతో కలసి సహపంక్తి భోజనాలు చేసి పారిశుధ్య కార్మికుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న తమని ఇలా ఎవరు పిలవలేదని, ఇంటికి పిలిచి తమతో పాటు కలిసి భోజనం చేసిన రాంబాబు కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పట్టణంలో పారిశుధ్ధ్య నివారణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులతో కలసి తమ కుమార్తె శరణ్య పుట్టిన రోజు వేడుకలు జరిపిన ఐతబోయిన రజిత రాంబాబుగౌడ్ దంపతులను పట్టణానికి చెందిన పలువురు అభినందించారు.