ప్రభుత్వ ఉద్యోగులపట్ల బీఆర్ఎస్ పార్టీ సవతి తల్లి ప్రేమ
-పీఆర్ సీ మొదలు డీఏ మంజూరు వరకు అన్నింటా ఆలస్యమే.
-కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగులకు న్యాయం.
-మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్.
మెదక్ యదార్థవాది ప్రతినిది
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల బీఆర్ ఎస్ సవతి తల్లి ప్రేమ చూపిందని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. ఉద్యోగులను తీవ్ర అన్యాయానికి గురి చేశారని మండిపడ్డారు. పీ ఆర్ సీ మంజూరులో కేసీఆర్ తీవ్ర వివక్ష ప్రదర్శించారన్నారు. మూడు సంవత్సరాలు ఆలస్యంగా పీఆర్ సీని మంజూరు చేశారని పేర్కొన్నారు. ఫలితంగా ఉద్యోగులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు భత్యం (డీఏ) మంజూరులోనూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 9 శాతం డీఏ పెండింగ్ లో ఉందన్నారు. డీఏ మంజూరు చేయకుండా 5 శాతం మధ్యంతర భృతి కల్పిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులతో సంప్రదింపులు లేకుండా మధ్యంతర భృతి ప్రకటించడం శోచనీయమన్నారు.