ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు
సిద్దిపేట యదార్థవాది
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ, కృషితో ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని పాథాలజీ (1), మైక్రోబయోలజీ (1), కమ్యూనిటీ మెడిసిన్ (2), జనరల్ మెడిసిన్ (4), పిడియాట్రిక్ (3), డివిఎల్ (1), సైకియాట్రీ (1), రేడియాలజీ (1), జనరల్ సర్జరీ (4), ఆర్థోపెడిక్ (2), ఈఎన్టీ (1), గైనకాలజీ (4), అనస్థీషియా (3) తో పాటు మొత్తం 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదని, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నదని, మరోవైపు జిల్లాకో మెడికల్ కళాశాలను తీసుకొచ్చి వైద్య విద్యను చేరువ చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఏకకాలంలో జిల్లాకు 28 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు, వైద్యులు, వైద్య విద్యార్థులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.