మాభూమిని కబ్జాదారుల నుండి కాపాడండి
-భూమికి సంబంధం లేని వ్యక్తులు వస్తున్నారు
-రెవెన్యూ, ఎస్.ఆర్.ఎస్.పి అధికారులు తమకు న్యాయం చేయాలి
ఆర్మూర్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండల పరిధిలోని నికల్పూరు గ్రామ శివారులో పోచంపాడు బ్యాక్ వాటర్ లో ముంపుకు గురైన 12 కులాలు 40 కుటుంబాలకు చెందిన 399/1 సర్వే నంబర్ పురాతన భూమిని ఆ ఊరికి సంబంధం లేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ధరణిని అడ్డం పెట్టుకొని కబ్జా చేయడమే కాకుండా కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చి తమ భూమిని కబ్జా చేశాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులు ట్రాక్టర్ సహాయంతో భూమిని చదును చేయడానికి ప్రయత్నం చేయగా భూమికి సంబంధించిన 40 కుటుంబాలకు చెందిన వ్యక్తులు అడ్డుకోవడం జరిగింది. వివరాలలోకి వెళితే పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందని అధికారులు తమ ఊరిని వదిలిపెట్టి వేరేచోటకు వెళ్లాలని సూచించడంతో తమ భూమిని అక్కడే వదిలేసి వేరే ప్రాంతానికి వలస వెళ్లడం జరిగిందని, మేము వదిలి వచ్చిన భూమికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం కూడా రావడం జరిగిందని, ఈ భూమిపై కన్నేసిన వెంకటేశ్వర్ అనే వ్యక్తి గత ప్రభుత్వంలో ధరణి సహాయంతో పట్టా చేయించుకుని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చి భూమిని చదును చేస్తున్నాడని ఆ భూమికి సంబంధించిన వ్యక్తులు ఏంటని ప్రశ్నిస్తే తమకు కోర్టు నుండి పర్మిషన్ ఉందని చెప్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ భూమిలోనే గ్రామానికి సంబంధించిన పశువులు పడుకోవడానికి వదిలేసామని అలాంటి భూమిని కబ్జా చేస్తే తమ పశువులు ఎక్కడ ఉండాలో అధికారులే తెలపాలని కోరారు. అక్రమంగా ధరణినీ అడ్డం పెట్టుకొని తమ భూములను పట్టా చేసుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరుకున్నారు.