మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
-టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: వార్తల కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై అకారణంగా దాడి చేసి గాయపరిచి అసభ్య పదజాలంతో దూషించిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అనుబంధం) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగ బంటు కృష్ణ మాట్లాడుతు వృత్తి బాధ్యతగా కవరేజ్ కి వెళ్లిన మీడియా ప్రతినిధులను దూషించి దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. ఒక సీనియర్ నటుడుగా పద్మశ్రీ అవార్డు పొందిన నటుడు మోహన్ బాబు ప్రతి విషయంలో ఓర్పు వహించాలని ఆయన అన్నారు. కుటుంబంలోనే పరస్పర వివాదాలను పరిష్కరించుకోలేక బయటకు వచ్చారని, అలాంటప్పుడు ఒక సెలబ్రిటీ విషయంలో ఏమి జరుగుతుందని ఆదుర్దా సమాజానికి తెలియజెప్పే బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. సమన్వయ లోపంతో కుటుంబ విషయాలను బహిర్గతం చేసుకున్న మోహన్ బాబు మరింత దుందుడుకుగా వ్యవహరించి కవరేజ్ కి వచ్చిన టీవీ9 ప్రతినిధి రంజిత్ తో పాటు ఎన్టీవీ, ఈటీవీ ప్రతినిధులపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి తలవొంపులు తెచ్చే విషయాల పట్ల మోహన్ బాబు ఓర్పుతో వ్యవహరించాల్సి ఉండేదని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రజలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వృత్తి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల దాడులు జరిగితే సంబంధిత వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టి యు డబ్ల్యూ జే ఐజేయు సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున్ రెబ్బ విజయకుమార్ లు మాట్లాడారు. ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో విలేకరులు తండు వెంకటేష్, మధు, వేణుమాధవ్, జనార్ధన చారి, పాషా, పల్లె మణి బాబు, రామచంద్ర రాజు, వెంకటేష్, విక్రం, జహీర్ తదితరులు పాల్గొన్నారు.