రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల లో సమావేశం నిర్వహించి రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల పై చర్చించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 491 గ్రామ పంచాయతీలలోని వార్డులలో 4350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పోలింగ్ కేంద్రాల జాబితాను గ్రామ పంచాయతీలలో ప్రధర్చించడం జరిగిందని అన్నారు. ఈ రోజు జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు గానే ఈ నెల 12 వతేదీన గురువారం మండల కేంద్రాలలో ఎంపిడిఓ లు మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారని ఓటర్ల సౌకర్యం కోసం గ్రామపంచాయతీ వార్డులలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేస్తే అవుసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, జెడ్పి సిఇఓ రమేష్, డిఎల్పిఓ మల్లికార్జున్, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్ ఇమాముద్దీన్, గియాశుద్దీన్, బిఆర్ఎస్ మోహన్ లాల్, బీజేపీ విభీషన్ రెడ్డి, బిఎస్పీ వెంకట్, తిరుపతి, రాజు, ఏఐఎంఐఎం ఎండి మునీర్, సిపీఐ రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ సతీష్ కుమార్, పున్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.