రాష్ట్రంలో స్వర్ణకార ఫెడరేషన్ ను ఏర్పాటు చేయాలి
సూర్యాపేట యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారుల సంక్షేమానికి స్వర్ణకార ఫెడరేషనన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు తొగిటి మురళి అన్నారు. ఆంద్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణు మాధవ్ శుక్రవారం జిల్లా కేంద్రానికి రావడంతో ఆయనను ఘనంగా సన్మానించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భాగమైన స్వర్ణకార, వృత్తి కళాకారులు నేడు ఉపాధి కరువై వృత్తి ని వదలలేక ఇతర పనులు చేయలేక అప్పుల బాదతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బ్యాంకు లోన్ ద్వారా బంగారు బిస్కట్లను స్వర్ణకారులకు అందిస్తున్నారని, అలాగే స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారుల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లుగా మన రాష్ట్రంలో కూడా స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుల నారాయణ్ దాసు రామాచారి, జిల్లా ఉపాధ్యక్షులు అనుముల బ్రహ్మచారి, రాగి శ్రీనివాసచారి, అనుముల గోవిందచారి, భాస్కరాచారి, రహీం, రమేష్, తంగేళ్లపల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.