లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
జిల్లా కోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి
విశాఖపట్నం, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి, నాల్గో అదనపు, సెషన్స్ జడ్జి ఎం. నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పని చేస్తోందని గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్ వద్ద శనివారం జరిగింది. జిల్లా కోర్టు ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తోందని గుర్తు చేశారు. లోక్ అదాలత్ లాంటి వేదికల్లో పౌర శిక్షాస్మృతి, నేర శిక్షాస్మృతి పరిధిలోని రాజీకాగలిగిన కేసులు, మోటారు ప్రమాదాల కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పరిష్కారానికి వస్తాయన్నారు. ప్రభుత్వ సంస్థలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కక్షిదారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి. శేషమ్మ, శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ జి. వల్లభ నాయుడు, ఫ్యామిలీ కోర్టు జడ్జి కె. రాధారత్నం, బార్ అసోసియేషన్ కార్యదర్శి డి. నరేష్ కుమార్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.