తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.
హైదరాబాద్, మార్చ్ 11 యదార్థవాది ప్రతినిధి:
ఈ నెల 15న రాష్ట్రపతి, 16న ఉప రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రముఖుల రాక నేపథ్యంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూసుకోవడంతో పాటు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతి భద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. అదేవిధంగా విమానాశ్రయం, రాజ్ భవన్ అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. భారత రాష్ట్రపతి కాన్వాయ్ ఉపయోగించాల్సిన మార్గాలతో పాటు రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు, గేటర్ హైదరాబాద్ మహానగరం కార్పొరేషన్ అధికారులతో సమన్వయంతో చేపట్టాలని రోడ్లు భవనాల శాఖకు ఆదేశించారు. రాష్ట్రపతి సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఇంధన శాఖను ఆదేశించారు. డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్రావు, సీఎండీ టీఎస్పీడీసీఎల్ ముషారఫ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.